ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: పత్తిపాటి, నారాయణపై కేసులు

23 Jan, 2020 14:53 IST|Sakshi

రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసు నమోదు

సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్‌ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.  ఈ సందర్బంగా ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని సదరు మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్‌ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ)

విచారణలో ఆసక్తికర విషయాలు:
మాజీ మంత్రులపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంతో 797 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్‌ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తిచామని మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్‌ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు)

అమరావతిలో 129 ఎకరాల భూమిని 131 మంది, పెద్దకాకానిలో 40 ఎకరాల భూమి 43 మంది, తాడికొండలో120 ఎకరాలను 188 మంది తెల్ల రేషన్‌ కార్డుదారుల పేరుపై రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. కాగా తుళ్లూరులో 133 ఎకరాల భూమిని 148 మంది తెల్ల కార్డుదారులు కొనుగొలు చేయగా, మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది కొన్నారని, తాడేపల్లిలో 24 ఎకరాల భూమిని, 49 మంది కొనుగొనులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. (చదవండి: తెల్లబోయే దోపిడీ)

మరిన్ని వార్తలు