మత్తు తినుబండారాలు ఇచ్చి..

11 Sep, 2018 12:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ: రాజమండ్రి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన జరిగింది. వివరాలు..ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఏలూరు శ్రీనివాసులు అనే ప్రయాణికుడిని గుర్తుతెలియని వ్యక్తి దోచుకున్నాడు. ఏలూరు శ్రీనివాస్‌ రాజమండ్రిలో గరుడ బస్సు ఎక్కాడు. మరో వ్యక్తి ప్రయాణంలో శ్రీనివాస్‌తో పరిచయం పెంచుకున్నాడు. తనను నమ్మాడని ధృవీకరించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న బాదం పాలు, తినుబండారాలను తోటి ప్రయాణికుడికి ఇచ్చాడు. వాటిని తిని తాగిన తర్వాత కొద్దిసేపటికే ఏలూరు శ్రీనివాస్‌ స్పృహ కోల్పోయాడు.

విజయవాడకు దగ్గరలోకి రాగానే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను ఆర్టీసీ సిబ్బంది గమనించారు. జేబులోని ఐడీ కార్డు ద్వారా ప్రకాశం జిల్లా దర్శి వాసిగా గుర్తించారు. ఈ విషయం గురించి కృష్ణలంక పోలీసులకు ఆర్టీసీ అధికారులు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో తోటి ప్రయాణికుడు మత్తు ఇచ్చి దోచుకున్నట్లు శ్రీనివాస్‌ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు