వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..

25 Sep, 2019 12:21 IST|Sakshi
పోలీసుస్టేషన్‌ వద్ద బాధితురాలు

నెల్లూరు, నాయుడుపేటటౌన్‌: ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పది సవర్ల బంగారు నగలు అపహరించి పరరాయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేటలో మంళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా మిద్దెపై విశ్రాంతి ఉపాధ్యాయురాలు చతురవేదుల విశాలక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్తుతెలియని యువకుడు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లాడు.

వెంటనే ఆమె మెడలో ఉన్న మూడు బంగారు చైన్లను లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలు పెద్దఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుండగుడు రైల్వే స్టేషన్‌ రహదారి వైపు ఉడాయించాడు. సమాచారం అందుకున్న ఎస్సై డి.వెంకటేశ్వరరావు వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. నిందితుడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.  కాగా పరారైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన తర్వాత పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు పెద్దఎత్తున నిందితుడి కోసం జల్లెడ పట్టారు. ఓ మద్యం షాపు వద్ద నిందితుడు ఉండగా పట్టుకున్నారు. అతనితోపాటు మరో వ్యక్తి ఈ చోరీలో పాలుపంచుకున్నట్లుగా సమాచారం. 

మరిన్ని వార్తలు