కిడ్నీ విక్రయాల పేరుతో మోసం

6 Jul, 2019 07:26 IST|Sakshi
నిందితుడు శివ

ఆన్‌లైన్‌ ప్రకటనలతో టోకరా

తమిళనాడుకు చెందిన వ్యక్తి అరెస్ట్‌

నేరేడ్‌మెట్‌: కిడ్నీ విక్రయాల  పేరుతో   మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా, గోవిందనగరం(అంబసముద్రం– తేని)కి చెందిన దీనదయాలన్‌ సూర్యాశివరామ్‌ శివ ( ‘కిడ్నీ డోనర్స్‌–బయ్యర్స్‌’పేరుతో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారు కాంట్రాక్ట్‌ చేస్తే తాను కిడ్నీ ఫెడరేషన్‌లో ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకునేవాడు. కిడ్నీ విక్రయించడానికి ఆసక్తి ఉన్న వారు అతడిని సంప్రదించగా ముందుగా ఫెడరేషన్‌లో పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించాడు. ఇందుకు గాను తన ఖాతాలో  రూ.15వేలు డిపాజిట్‌ చేయించాలని కోరేవాడు.

అనంతరం వారి ఆధార్, పాన్, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించే అతను ఆపరేషన్‌కు ముందు ఒప్పందం ప్రకారం 50శాతం డబ్బులు, తరువాత 50శాతం డబ్బులు చెల్లిస్తారని బాధితులను నమ్మించేవాడు. నకిలీ క్లయింట్ల జాబితాను తయారు చేసి, రూ.కోటి తన ఖాతాలో జమ అవుతున్నట్లు వచ్చిన నకిలీ ఎస్‌ఎంఎస్‌లను దాతల ఫోన్లకు పంపేవాడు. ఈ మేరకు ఫెడరేషన్‌ పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా దాతలకు పంపించి నమ్మించేవాడు. పలువురిని నుంచి ఫీజుల పేరుతో ఖాతాల్లో నగదు జమ చేయించు కున్న అనంతరం వారి ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేవాడు. అతడి చేతిలో మోసపోయిన బాధిడుతు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు  ఫేస్‌బుక్, ఇతర ఆన్‌లైన్‌ వివరాల ఆధారంగా నిందితుడిని  నేరేడ్‌మెట్‌లో అరెస్టు చేశారు. అతడి నుంచి నకిలీ పత్రాలతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అవయవదానం చేయడానికి అనేక నిబంధనలు, చట్టాలు ఉన్నాయని, ఆన్‌లైన్‌లో ప్రకటనలు చూసి మోస పోవద్దని సీపీ సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు రివార్డులను ప్రకటించారు.

మరిన్ని వార్తలు