సాక్షి, చెన్నై : ఊరికో పేరు...ఒక్కో యువతి వద్ద ఒక్కో తీరు. డాక్టర్, ఇంజినీర్, రియల్ వ్యాపారి...ఇలా రకరకాల వృత్తులుగా ప్రచారం చేసుకుంటూ చలామణి, వివాహవేదికలు, పెళ్లికాని యువతులే పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్న యువకుని పాపం పండటంతో జైలు పాలయ్యాడు. చెన్నైకి చెందిన బాధిత వైద్యురాలి ఫిర్యాదుతో తిరువణ్ణామలైకి చెందిన చక్రవర్తి (35)ని ఈనెల 17న అదుపులోకి తీసుకుని విచారణ చేయగా శనివారం ఈ ఘోరాలు వెలుగుచూశాయి. ఇతని బారినపడి 9 మంది యువతులు రూ.10 కోట్లను పోగొట్టుకున్నారు. వివరాలు... చెన్నైలోని ప్రముఖ ప్రైవేటు ఆస్పపత్రిలో వైద్యురాలిగా పనిచేసే ఒక యువతి తన వివాహ ప్రయత్నాల్లో భాగంగా వివాహవేదిక వెబ్సైట్లో 2016లో వివరాలను నమోదు చేసుకుంది. తిరువణ్ణామలైకి సెల్వనాయగర్ నగర్కు చెందిన చక్రవర్తి (35) అనే యువకుడు సదరు వేదిక ద్వారా ఆమెకు ఫోన్లో పరిచయం అయ్యాడు. వివాహితుడైన విషయాన్ని దాచిపెట్టి తాను వాషింగ్టన్లో వైద్యునిగా పనిచేస్తున్నాని చెప్పడంతో అతడిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుంది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ అతనిపై ప్రేమను పెంచుకుంది. చెన్నై క్రోంపేటలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు.
పెళ్లి చేసుకుందామని ఆమె కోరగా తన తల్లి చనిపోయిందని.. ఏడాది వరకు శుభకార్యాలు చేయకూడదని దాటవేశాడు. అతని మాటలు నమ్మిన వైద్యురాలు అప్పటి నుంచి తరచూ అతడిని కలుసుకోవడం చేసేది. ఇదే అదనుగా, తాను తిరువణ్ణామలైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నానని చెప్పడంతో రూ.6.90 కోట్లను అతడి వ్యాపారానికి సహాయం చేసింది. ఏడాది గడిచినా పెళ్లి ప్రస్తావన దాటవేస్తూ అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో వైద్యురాలు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దీంతో చక్రవర్తిని అరెస్ట్ చేశారు. పెళ్లికాని యువతులు, వితంతువులే లక్ష్యంగా వేర్వేరు పేర్లతో పరిచయం చేసుకుని 2012 నుంచి మోసాలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రేమ, పెళ్లి పేరుతో శారీరక వాంఛలు తీర్చుకోవడం, డబ్బులు కాజేయడం, పెళ్లి ప్రస్తావన తేగానే పారిపోవడం అతడికి పరిపాటి. 2014 మధురైలో ఇద్దరు యువతులను మోసం చేయడంతో అరెస్టయ్యాడు. అలాగే తిరుచ్చిరాపల్లి లాల్కుడికి చెందిన మరో యువతిని వాడుకుని రూ.18.70 లక్షలు కాజేయడంతో మరోసారి అరెస్ట్ చేశారు. ఇలా తమిళనాడు వ్యాప్తంగా ఇద్దరు వైద్యురాళ్లు, నలుగురు ఇంజినీర్లు, ఒక ఫిజియోథెరపిస్ట్ వైద్యురాలు, ఇద్దరు వితంతువులు, పలువురు పట్టధారులు సహా మొత్తం 20 మంది యువతుల వరకు అతని వలలో చిక్కుకుని రూ.9 కోట్లకు పైగా మోసపోయారు.
9 మంది యువతులకు 9 పేర్లతో పరిచయం చేసుకున్నాడు. వీరంతా సమాజంలో పెద్ద పేరు, ప్రఖ్యాతలున్న యువతులేగాక చేతినిండా సంపాదించే వ్యక్తులు కావడం గమనార్హం. పోలీసులకు పట్టుబడే ముందు చివరిగా అతడి వలలో చిక్కుకున్న చెన్నై అయ్యప్పతాంగల్కు చెందిన వైద్యురాలికి 38 ఏళ్లయినా పెళ్లి కాలేదు. పైగా లావుగా ఉంటుంది. దీంతో ఆమెను వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన చక్రవర్తి ఆమె తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లిచూపులు పూర్తిచేసుకున్నాడు. లావుగా ఉండే అమ్మాయిలంటేనే నాకు ఇష్టమని నమ్మబలికి రూ.6.90 కోట్లతో పాటు తనను తాను నిలువునా సమర్పించుకుంది. కుంభకోణంలో ఒక ఇంజినీరుకు వలవేసి రూ.1.30 కోట్లు కాజేశాడు. పెళ్లి పేరుతో కాజేసిన డబ్బుతో తిరువన్ణామలై, వేలూరు, విళుపురం జిల్లాల్లో కొనుగోలు చేసిన అనేక ఇళ్లు, భూములు, 3 లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చక్రవర్తిపై ఇంకా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించాలని క్రైంబ్రాంచ్ పోలీసులు నిర్ణయించారు.
ప్రభుత్వాధికారి సలహాతోనే మోసాలు : చక్రవర్తి
ఎంఈ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నేను 2017లో పెళ్లి చేసుకున్నాను. మాకు రెండేళ్ల కుమార్తె ఉంది. జీవితంలో దర్జాగా స్థిరపడేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించాను. అయితే మాది పేద కుటుంబం కావడంతో తగినంతగా డబ్బు లేదు. తిరువణ్ణామలైలోని సొంతిల్లు అమ్మి ఇంజినీరింగ్ చదివాను. నా ఇద్దరు సోదరీలు పేదింటిలోనే పెళ్లి చేసుకున్నారు. ఎలాగోలా కష్టపడి చక్రవర్తి బిల్డర్స్ అనే సంస్థను స్థాపించి ఇళ్లు అమ్మడం, కొనడం వంటి వ్యాపారంతో బాగా సంపాదించాను. పెద్ద ఇల్లు, కారు కొనుకున్నాను. అయితే కొన్నాళ్లకు వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో లగ్జరీ జీవితాన్ని వదులుకోలేక పెళ్లిళ్ల పేరుతో మోసాలకు దిగాను. చెన్నై క్రోంపేటలో నేను నివసించే సమయంలో ఒక ప్రభుత్వ అధికారి పరిచయం అయ్యాడు. ఇంటర్నెట్, మ్యాట్రిమోని వెబ్సైట్ల ద్వారా యువతులతో పరిచయాలు పెంచుకుని మోసం చేయడం ఆయన నేర్పాడు. ఈ మోసాల వృత్తిలో అతడే నాకు గురువు. నాచేతిలో మోసపోయిన నలుగురు యువతులు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన వారు వేరేవారిని పెళ్లి చేసుకుని జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ కేసుల నుంచి బైటపడగానే నా భార్యతో కలిసి బుద్ధిగా జీవించాలని నిర్ణయించుకున్నానని చక్రవర్తి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.