భార్యకు మద్యం తాగించి, కారుతో తొక్కించి..

5 Dec, 2019 08:42 IST|Sakshi

బెంగళూరులో ఓ కిరాతక భర్త అఘాయిత్యం

సాక్షి బెంగళూరు: కారులో షికారుకు వెళ్లొద్దామని చెప్పి తన భార్య తీసుకెళ్లి కారుతో తొక్కించి హత్య చేశాడో కిరాతకుడు. ఈ ఘటన నవంబర్‌ 16న జరిగితే ఆలస్యంగా వెలుగు చూసింది. 27 ఏళ్ల తేజ్‌సింగ్, భార్య దీపల్‌ కంవార్‌ (27)లు రాజస్థాన్‌కు చెందిన దంపతులు. వీరికి బెంగళూరులో చిన్న బంగారం దుకాణం ఉంది. హొణిసేమారనహళ్లి వద్ద జనతా కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. తరచూ గొడవ పడుతోందని  భార్యను హత్య చేయాలని తేజ్‌సింగ్‌ నిర్ణయించుకున్నాడు. నవంబర్‌ 16న తన స్నేహితుడు గురుప్రీత్‌ సింగ్‌ పేరిట అద్దెకు కారు తీసుకున్నాడు. 

అనంతరం భార్య, స్నేహితుడు శంకర్‌ సింగ్, భరత్‌ సింగ్‌తో కలిసి అమృతహళ్లి సమీపంలోని హోటల్‌కు వెళ్లి రాత్రి భోజనం చేశారు. స్నేహితులతో కలసి మద్యం సేవించిన తేజ్‌సింగ్, తన భార్యకు కూడా బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత స్నేహితులను వారి ఇంటి వద్ద విడిచి రాత్రి 12.20 గంటలకు భార్యను దేవనహళ్లి రోడ్డుకు తీసుకొచ్చాడు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న భార్యను బచ్చళ్లి గేట్‌ సమీపంలో నడుస్తున్న కారులో నుంచి బయటకు తోసి, కారుతో తొక్కించి హత్య చేశాడు. పోలీసులు విచారణ జరిపి తేజ్‌సింగ్‌ను, అతనికి సహకరించిన దుండగులను అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు