బాలికను గర్భవతిని చేసి యువకుడి పరార్‌

10 Jan, 2018 06:49 IST|Sakshi

కేసు నమోదు చేసిన పోలీసులు

పామిడి: బాలికను ప్రేమపేరుతో నమ్మించి, వాంఛతీర్చుకుని, గర్భం దాల్చిన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయిన యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామగిరి ఎగువతండాకు చెందిన బాలిక కుటుంబం గత ఏడాది బంజారాల ఆరాధ్య దైవం సేవాఘడ్‌కు వెళ్లింది. అప్పుడు అక్కడకు వచ్చిన వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి చిన్నతండాకు చెందిన అశోక్‌నాయక్‌తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న యువకుడు అమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా కలిశాడు.

ఇటీవల ఆరోగ్యం బాగలేదని అమ్మాయిని డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లగా గర్భవతి అని బయటపడింది. ఈ విషయం తెలియగానే అశోక్‌నాయక్‌ కనిపించకుండా పోయాడు. బాధితురాలి అన్న పామిడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అశోక్‌నాయక్‌పై పోక్సో చట్టం కింద 5–జే, 5–1 సెక్షన్లు, 420, 376 ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

>
మరిన్ని వార్తలు