నైట్ అవుట్స్‌తో డ్రగ్స్‌కు దగ్గరవుతున్న యువత

23 Jun, 2019 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైట్ అవుట్‌.. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్‌ అవడానికి చేసేది. ఉద్యోగులు పని నిమిత్తం చేయవలసి వచ్చేది. కానీ ఇవేవీ కాకుండా దీనికి కొత్త అర్థాన్ని సృష్టించేశారు ఘరానా దొంగలు. కొత్త అర్థాలు చేర్చుకున్న నైట్‌ అవుట్స్‌పై సాక్షి స్పెషల్‌ ఫోకస్‌.. నైట్‌ అవుట్స్‌ పేరు వినపడితే పోలీసులే బెదిరిపోతున్నారు. అంతలా హడలెత్తిస్తున్న నైట్స్‌ అవుట్స్‌ అనే పదానికి అర్థం ఫోన్‌ను చోరీ చేయడం. కొట్టేసిన ఫోన్‌ను మార్కెట్‌లో ఎంతోకొంతకు అమ్మేయడం, వచ్చిన డబ్బులతో గంజాయి కొనడం పరిపాటిగా మారింది అనేక మంది యువకులకు. గంజాయి కొనడం కోసం దొంగతనాలకు సైతం వెనుకాడట్లేదు యువత. ఆందోళన కలిగించే విషయమేంటంటే పోలీసులకు పట్టుబడుతున్న ప్రతి ముగ్గురు దొంగలలో ఒకరు మైనర్‌ కావటమే. దీనికి రీసెంట్‌గా జరిగిన ఈ ఘటనే ఉదాహరణ.

చిలకలగూడలో షబ్బీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఫోన్‌ మాట్లాడుతుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అతన్ని అటకాయించారు. అతని నుంచి మొబైల్‌ ఫోన్‌, ఒక తులం బంగారు చైన్‌ను అపహరించుకుపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌ దొంగిలించింది తామేనంటూ ఆ ముగ్గురు యువకులు నేరాన్ని అంగీకరించారు. వీరిలో ఒకరు ఆర్మీ అధికారి కుమారుడు. ఫోన్లను ఎందుకు దొంగిలిస్తున్నారని, వాటితో ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా గంజాయి కొనటం కోసమేనంటూ సమాధానమిచ్చారు.

ప్రతీ ముగ్గురిలో ఒకరు మైనరే.....
ఈ విషయంపై  సీనియర్‌ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. పట్టుబడుతున్న ప్రతీ ముగ్గురిలో ఒకరు మైనర్‌ కావటం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. నేరస్తులు ఎవరికీ ఏ అనుమానం రాకుండా కోడ్‌ పద్ధతిలో దందా సాగిస్తున్నారన్నారు. డ్రగ్స్‌కు బానిసైన యువకులు ‘లెట్స్‌ డూ నైట్‌ అవుట్‌’ అన్నారంటే ఫోన్‌ చోరీకి సిద్ధం అవుతున్నట్టే. ప్రస్తుతం దొంగలు ఎంచుకున్న ఈ కొత్త పద్ధతి సికింద్రాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాచకొండ, సైబరాబాద్‌ ప్రాంతాలకు విస్తరించింది.

గడిచిన నాలుగు నెలల్లోనే ఫోన్లు చోరీ చేస్తూ 15 నుంచి 20 మంది యువకులు పట్టుబడ్డారు. పైకి మొబైల్‌ దొంగలుగా కనిపించే వీరు గంజాయి బాధితులే. గంజాయికి బానిసై ఫోన్లను దొంగిలించి, దాన్ని చైనా మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఆ మార్కెట్‌లో ఎంత విలువైన ఫోన్‌ అయినా రూ.3,500కు మించి వీరికి సొమ్మవదు. అయినా దానికోసం ఆలోచించరు. ఎంతో కొంత గంజాయి వస్తుంది కదా అనే ఆలోచనే ఉంటారు డ్రగ్స్‌ బాధితులు. పోలీసులు డ్రగ్స్‌కు బానిసలవుతున్న యువకులను పేరెంట్స్‌ ముందు హెచ్చరించి వదిలేస్తున్నారు. అయితే ఈ సమస్యను సులువుగా వదిలేయమని, పరిష్కార మార్గాలు వెతుకుతున్నామన్నారు. యువతను చెడు ప్రభావాలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు