అమానుషం: కిందపడిన వ్యక్తిని దొంగ అనుకొని..

20 Jun, 2018 15:38 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తిని చేరదీయాల్సిందిబోయి.. పశువుల దొంగని కొట్టి చంపారు. ఈ ఘటన యూపీలోని హాపూర్‌ జిల్లాలో పిలఖువా ప్రాంతంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాసీం(45), అతని స్నేహితుడు సమీయుద్దీన్‌ ఇద్దరు పశువుల ఉండే చోట ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. పశువుల పాకలోని గేదె, దూడను దొంగిలించేందుకు వచ్చారనే అనుమానంతో వారిద్దరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనలో 45 ఏళ్ల ఖాసీం తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జనమంతా చుట్టుముట్టగా బాధితుడు ఖాసీం తీవ్రగాయాలతో దాహం వేస్తుందని నీళ్లు అడుగుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఆ వీడియో తమకు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

మరిన్ని వార్తలు