యువతిపై సామూహిక లైంగికదాడి

9 Aug, 2018 07:43 IST|Sakshi

అమీర్‌పేట్‌:  ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటమే గాకుండా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తామని  బెదిరిస్తుండటంతో బాధితురాలు బుధవారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, నూజివీడు, గాంధీనగర్‌కు చెందిన తాను ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని  రమా హోమ్‌లో ఉంటున్నట్లు తెలిపింది. హోమ్‌ నిర్వాహకురాలు రమ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని , శిరీష అలియాస్‌ జయశ్రీ అనే మహిళను పరిచయం చేసిందని,  సోషల్‌ వర్కర్‌గా చెప్పుకునే శిరీష గత మార్చి 5న అమెరికా నుంచి తన స్నేహితులు వచ్చారని ఉద్యోగ విషయమై వారితో మాట్లాడదామని తనను కారులో గుంటూరుకు తీసుకెళ్లినట్లు తెలిపింది.

మార్గమధ్యంలో  మత్తుమందు కలిపిన మంచినీళ్లు ఇవ్వడంతో తాను స్పృహ కోల్పోయానని, మెలకువ వచ్చి చూసేసరికి ఓ గదిలో ఉన్నట్లు గుర్తించానంది. నలుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి  పాల్పడినట్లు గుర్తించినా కేసు పెడితే పరువు పోతుందని భయపడి ఫిర్యాదు చేయలేదని తెలిపింది. ఈ నెల 3న ఓ వ్యక్తి తనకు ఫోన్‌ చేయడమేగాక అర్ధనగ్నంగా ఉన్న తన ఫొటోలను వాట్సప్‌ పంపాడని, మరో వ్యక్తి కూడా ఫొటోలు పంపిస్తూ, తమకు లొంగిపోవాలంటూ లేని పక్షంలో ఫొటోలను యూట్యూబ్‌లో పెడతామని బెదిరించినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్‌ నిర్వాహకురాలు రమ, శిరీష తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు