90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. హత్య 

2 Mar, 2020 03:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హాలియా: సభ్యసమాజం తలదించుకునే విధంగా ఓ కామాంధుడు 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు (90)కి నలుగురు కుమారులు. వారికి వివాహాలై వేరుగా ఉంటున్నా రు. భర్త చనిపోవడంతో వృద్ధురాలు గ్రామ శివారులోని ఓ గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆదివారం కుటుంబ సభ్యులు వృద్ధురాలి గుడిసె వద్దకు వెళ్లి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద కుమారుడు ప్రయత్నించగా నేలపై రక్తపు మరకలు కనిపించాయి. మృతదేహంపై గాయాలు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామానికి చెందిన సత్రశాల శంకర్‌ మద్యం సేవించి వృద్ధురాలి గుడిసె చుట్టూ పలుమార్లు తిరిగాడని, అతడే తన తల్లిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు పెద్ద కుమారుడు లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శంకర్‌ గతంలోనూ గ్రామంలోని ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.  

మరిన్ని వార్తలు