‘అమ్మా’నవీయం.. 

30 Jan, 2018 15:34 IST|Sakshi
వివరాలు రాసుకుంటున్న అధికారి యశోద, (ఇన్‌సెట్‌) బాలుడి శరీరంపై వాతలు 

మట్టి తింటున్నాడని ఇష్టారీతిన వాతలు పెట్టిన తల్లి

భద్రాచలంటౌన్‌: అయ్యో పాపం..పసివాడు. నాలుగేళ్ల పిల్లాడు. కానీ..ఆ తల్లి ఎంత కోపంతో ఉందో..ఏ బాధలో చేసిందో కానీ..కర్కశంగా వాతలు పెట్టింది. తాను కన్న బిడ్డే అయినా..ఎందుకో ఆ క్షణంలో మానవత్వం మరిచింది. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జగదీష్‌ కాలనీకి చెందిన పల్లపు లంకమ్మ తన నాలుగేళ్ల కుమారుడు రఘురాం మట్టి తింటున్నాడని వాతలు పెట్టింది. ఈమె భర్త ఈ ఏడాది అక్టోబర్‌లో చనిపోయాడు.

అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండట్లేదు. ఆరేళ్ల కూతురితో పాటు ఈ బాబును సాకేందుకు ఆదాయం లేక, అటు భర్త మరణం తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని..కోపాన్ని పిల్లలపై చూపుతుంటుందని ఐసీపీఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీం) కౌన్సిలర్‌ యశోద తెలిపారు. ఈ క్రమంలో శనివారం పిల్లాడు రఘురాం మట్టి తింటున్నాడని కోపంతో గరిటెను కాల్చి ఎడమ బుగ్గ మీద, రెండు చేతుల మీద కాల్చింది. బాబు శరీరం కమిలి తల్లడిల్లుతుండడంతో స్థానికులు అంగన్‌వాడీ టీచర్‌  మాధవికి విషయం తెలిపారు. ఐసీడీఎస్‌ కౌన్సిలర్‌ యశోద, పోలీస్‌ వారు సోమవారం లంకమ్మ ఇంటికి వెళ్లి..కౌన్సెలింగ్‌ నిర్వహించి, బాలుడిని ఖమ్మంలోని చైల్డ్‌ కేర్‌లో ఉంచుతామని తెలిపారు. ఆ తల్లిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు