కీచక డాక్టర్‌పై స్పందించిన మహిళా కమిషన్‌

22 May, 2020 20:33 IST|Sakshi

సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ

సాక్షి, న్యూఢిల్లీ : ఫరీదాబాద్‌లోని క్యూఆర్జీ ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని లైంగిక వేధింపులకు గురిచేసిన డాక్టర్‌పై విచారణ చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) కోరింది. ఏప్రిల్‌ 18న ఆస్పత్రిలో జరిగిన ఘటనలో వైద్యుడిపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ట్విటర్‌ పోస్ట్‌ ఆధారంగా సుమోటోగా ఎన్‌సీడబ్ల్యూ ఈ కేసును చేపట్టింది. ఈ వైద్యుడు ఇతర మహిళా సభ్యుల పట్ల కూడా అభ్యంతరకరంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులు వచ్చినా ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదని దుయ్యబట్టింది.

వైద్యుడిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా బాధితురాలిని ప్రస్తుత పోస్ట్‌ నుంచి తప్పించి డిమోట్‌ చేసిందని ఎన్‌సీడబ్ల్యూ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారించిందా..? ఈ విచారణలో నిందితుడు దోషిగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ తక్షణమే కమిషన్‌కు నివేదిక పంపాలని కోరుతూ ఎన్‌సీడబ్ల్యూ క్యూఆర్జీ ఆస్పత్రి డైరెక్టర్‌ సంగీతా రాయ్‌ గుప్తాకు లేఖ రాసింది.

చదవండి : తారతమ్యం మరచిన తాతయ్య

మరిన్ని వార్తలు