అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు

17 Jun, 2020 04:17 IST|Sakshi

మున్సిపల్‌ కమిషనర్‌పై దుర్భాషలు..

బట్టలూడదీసే పరిస్థితి వస్తుందంటూ అసభ్యంగా దూషణ

నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు తెలిపారు.  

బట్టలూడదీసే పరిస్థితి వస్తుందంటూ...
మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. అయితే తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్‌ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్‌ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫోటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యేకు ఆమె తొత్తుగా మారారంటూ నోరు పారేసుకున్నారు. పోలీసులు, పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం చిత్రపటాన్ని నెల రోజుల్లో యథా«స్థానంలో పెట్టకపోతే కమిషనర్‌ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ‘కమిషనర్‌ ఆడ ఆఫీసర్‌ అయిపోయింది.. అదే మగవాడైతే వేరే విధంగా ట్రీట్‌మెంట్‌ ఉండేది...’ అంటూ బెదిరించారు. అయ్యన్నపాత్రుడి దుర్భాషలతో మనస్తాపం చెందిన కమిషనర్‌  పట్టణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు