నెల రోజుల్లో పెళ్లి.. కబలించిన మృత్యువు

23 Jan, 2020 07:55 IST|Sakshi

సాక్షి, మాచారెడ్డి: మరో నెలరోజుల్లో వివాహం జరగాల్సిన ఓ యువకుడిని అంతలోనే మృత్యువు కబలించింది. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన బుధవారం మండలంలోని చుక్కాపూర్‌ దేవస్థానం సమీపంలో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బండ రామేశ్వర్‌పల్లికి చెందిన మాదాసు సురేష్‌(25) అనే యువకుడు మంగళవారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదన్నారు. కుటుంబ స భ్యులు ఫోన్‌ చేసినా బదులు రా కపోవడంతో కంగారు పడ్డారు.

బుధవారం ఉ దయం మండలంలోని చుక్కాపూర్‌ లక్ష్మీనర్సింహా స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన శవమై కనిపించాడు. దీంతో సమీపంలో ఉన్న లక్ష్మీరావులపల్లి గ్రామస్తులు తమకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. నెలరోజుల కిందటే గల్ఫ్‌ నుంచి వచ్చిన సురేష్‌ మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

గ్రామస్తులు ‘అయ్యో బిడ్డా.. గల్ఫ్‌లో ఉన్నా బతికేవాడివి పాపం’.. అంటూ కంటతడి పెట్టారు. తమకు తలకొరివి పెట్టాల్సిన కొడుకు కాటికి చేరడంతో తల్లిదండ్రులు శ్యా మవ్వ, రాజయ్య బోరున విలపిస్తుంటే అందరి కళ్లు చెమర్చాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు