కేరళ నన్‌పై లైంగిక దాడి : కీలక సాక్షి మృతి

22 Oct, 2018 13:33 IST|Sakshi

చండీగఢ్‌ : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసుకు సంబంధించి బిషప్‌ ములక్కల్‌పై ఫిర్యాదు చేసిన మత ప్రబోధకుడు మరణించడం కలకలం రేపింది. పంజాబ్‌లోని జలంధర్‌కు సమీపంలో దాస్వా వద్ద ప్రబోధకుడు కురియకొస్‌ కథుథార మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో కురియకోస్‌ కీలక సాక్షి కావడం గమనార్హం. కాగా, తమ సోదరుడిని హత్య చేశారని, తనను హతమారుస్తామని గతంలో బెదిరింపులు వచ్చాయని బాధితుడి సోదరుడు వెల్లడించారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

కాగా కేరళ నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ములక్కల్‌కు కోర్టు ఈనెల 15న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిందితుడు తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, విచారణాధికారి ఎదుట హాజరయ్యేందుకు మినహా కేరళలో అడుగుపెట్టరాదని ములక్కల్‌కు కోర్టు షరతులు విధించింది. కాగా బిషప్‌ ములక్కల్‌ 2014 నుంచి 2016 మధ్య తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళ నన్‌ ఆరోపించారు. ఈ కేసును విచారించిన కేరళ పోలీసులు సెప్టెంబర్‌ 21న బిషప్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు