బైక్‌ అదుపుతప్పి యువకుడు..

11 Jul, 2018 11:30 IST|Sakshi
రమేశ్‌ మృతదేహం

సైదాపూర్‌(హుస్నాబాద్‌): మండలంలోని గుజ్జులపల్లి గ్రామానికి చెందిన గొర్రెలకాపరి నేరెల్ల రమేశ్‌(40) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు,పోలీసులు తెలిపారు. రమేశ్‌ గొడిశాలకు చెందిన నెల్లి రవి వద్ద గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. సోమవారం గొర్రెలను పక్కగ్రామం నల్లరామయ్యపల్లి వద్ద మేపుతూ.. అక్కడే ఒక పశువుల పాకలో మంద పెట్టారు. ఇతడితో మరో వ్యక్తి ఉన్నాడు. మంగళవారం వేకువజామున మరో వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఉదయన్నే లేచిన రమేశ్‌ కాలకృత్యాలు తీర్చుకుని మళ్లీ నిద్రించాడు. గంట తర్వాత తోటి గొర్రెలకాపరి వచ్చిచూసేసరికి చనిపోయి ఉన్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం చేరవేశాడు. మృతుడి భార్య తిరుమల ఫిర్యాదుతో ఎస్సై నూతి శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు.
 
బైక్‌ అదుపుతప్పి యువకుడు..
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన లింగాల తుక్కయ్య(26) మంగళవారం బైక్‌ అదుపు తప్పి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. తుక్కయ్య ఆరు సంవత్సరాల నుంచి సౌదీ వెళ్లివస్తున్నాడు. నెల రోజుల క్రితమే చుట్టిపై వచ్చాడు. మంగళవారం తన అత్తగారిల్లు అయిన జగిత్యాల మండలం గోపాల్‌రావుపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గ్రామ శివారులో వెంకట్రావుపేట– కాచారం వెళ్లే బైపాస్‌ రోడ్డు మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తుక్కయ్యకు భార్య సంధ్య, ఏడాది కూతురు ఉన్నారు.

మరిన్ని వార్తలు