రూ.3.6 కోట్ల గుట్కా పట్టివేత

19 Jan, 2018 01:50 IST|Sakshi

నాలుగు గుట్కా తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

హైదరాబాద్‌: గుట్కా తయారీ కేంద్రాలపై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. రూ.3.6 కోట్ల విలువైన గుట్కా, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌చార్జి కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు, దక్షిణ మండలం డీసీపీ  సత్య నారాయణ గురువారం ఇక్కడ కేసు వివరాలు వెల్లడించారు. మల్లేపల్లికి చెందిన షుజాత్‌ అలీ ఖాన్‌(48), హుమాయున్‌నగర్‌కు చెందిన ఖాజా సలీముద్దీన్‌(46) డబ్బులు సంపాదించేందుకు గుట్కా తయారీ ప్రారంభించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన అలీం, గోఖలే నుంచి గుట్కా ముడిసరుకు కొనుగోలు చేసి బండ్లగూడ ఇస్మాయిల్‌నగర్‌లో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ‘ఆదత్‌’, ‘పెట్రోల్‌’ బ్రాండ్‌లతో గుట్కా తయారు చేసి ఔరంగాబాద్‌ కు సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్య కుమార్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి, ఎస్సైలు జి.వెంకటరామిరెడ్డి, మహ్మద్‌ తఖీయుద్దీన్‌ దాడులు చేసి షుజాత్‌ అలీఖాన్, సలీముద్దీన్, రహీముద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు.  

స్వాధీనం చేసుకున్న సామగ్రి: నిందితుల వద్ద నుంచి ఎనిమిది మిషన్లు, ఒక మిక్సింగ్‌ మిషన్, ఆదత్, పెట్రోల్‌ బ్రాండ్‌లకు చెందిన 80 సంచుల గుట్కా, నాలుగు సంచుల్లో ఏ–జర్దా బ్రాండ్‌ గుట్కా, 24/7 బ్రాండ్‌ గుట్కా, మెగ్నీషియం కార్బొనేట్‌ పౌడర్, సుపారీ బ్యాగ్‌లు, గులాబ్‌ జెల్‌ బాటిళ్లు, పుదీనా క్రిస్టల్స్‌ కాటన్లు, 100 సంచుల పౌడర్, 50 కిలోల జర్దా, ఆటోట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   గుట్కారహిత నగరంగా హైదరాబాద్‌: కమిషనర్‌   నగర చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో గుట్కాను పట్టుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. గుట్కా రహిత నగరం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి రవాణా కాకుండా చూస్తున్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు