ఆక్యుప్రెషర్‌తో రోగాలు నయం చేస్తామంటూ...

5 Sep, 2018 18:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఆక్యుప్రెషర్‌ పేరుతో రోగాలు నయం చేస్తామంటూ మోసం చేస్తున్న ఒక ఏజెంట్‌, ఇద్దరు నకిలీ డాక్టర్లపై సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి శివమొగ్గకు చెందిన నూర్‌ మహ్మద్‌ సయ్యద్‌, సయ్యద్‌ షబ్బీర్‌ ఆక్యుప్రెషర్‌ వైద్యంతో రోగాలు నయం చేస్తామంటూ చంపాపేట్ బాలాజీ గార్డెన్‌లో 15 రోజుల ఒకసారి శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి రోగి వద్ద నుంచి 500 రూపాయలు వసూలు చేస్తూ లక్షల రూపాయలను దన్నుకున్నారు.

అన్ని రకాల రోగాలను నయం చేస్తామని నమ్మబలికి వేల మంది రోగులను తప్పు దోవ పట్టిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏజెంట్ల ద్వారా వేలాది మందిని శిబిరానికి రప్పించుకుంటూ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. మాదన్న పేటకు చెందిన మహ్మద్, ఆదిభట్లకు చెందిన సరస్వతి గతంలో ఎన్నో సార్లు వారి దగ్గర వైద్యం చేయించుకున్నారు. వైద్యం చేయించుకుంటున్నప్పటికి షుగర్ మరింత ఎక్కువవటంతో మోసపోయామని గ్రహించిన వారు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు. దీంతో ఒక ఏజెంట్, ఇద్దరు డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు