వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని..

1 Aug, 2018 19:24 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు, వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారి

సాక్షి, రంగారెడ్డి : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో శివరాంపల్లికి చెందిన ఆనంద్‌ను భార్య మహేశ్వరి ఆమె ప్రియుడు సంజయ్‌ హత్య చేశారని శంషాబాద్‌ డీసీపీ తెలిపారు. బుధవారం రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్‌ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ.. మే7వ తేదీన ఆనంద్‌ను హత్యచేసిన తర్వాత అతని శవాన్ని అర్థరాత్రి గంధంగూడ మూసీ సమీపంలో పెట్రోల్‌ పోసి తగలబెట్టారని అన్నారు.

అ తర్వాత అస్తికలను మూసీలో కలిపిన నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా భర్త కనిపించటం లేదని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య కేసును చేధించి మహేశ్వరి, ఆమె ప్రియుడు సంజయ్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

అసలేం జరిగింది...
వికారాబాద్ జిల్లాకు చెందిన ఆనంద్ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు.  2010లో పురానాపూల్‌కు చెందిన మహేశ్వరిని ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ముకేష్ (7) , భాను (5) ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మద్యానికి బానిసైన ఆనంద్‌ భార్యను పట్టించుకోవటం మానేశాడు. ఆనంద్ స్నేహితుడు సంజయ్‌ అతన్ని కలవటానికి తరుచుగా ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో మహేశ్వరి సంజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి భర్త ఆనంద్ అడ్డువస్తున్నాడనే కారణంతో అతన్ని చంపాలని పథకం రచించారు.

మే నెల 7వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆనంద్‌ను సంజయ్‌, మహేశ్వరి ఇద్దరు కలిసి హత్య చేశారు. తర్వాత అతని శవాన్ని అర్థరాత్రి గంధంగూడ మూసీ సమీపంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. రెండు రోజుల తర్వాత భర్త కనిపించడంలేదంటూ మహేశ్వరి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆనంద్ భార్యపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 

మరిన్ని వార్తలు