విషాదం.. తండ్రీకొడుకు జలసమాధి

8 Apr, 2019 09:46 IST|Sakshi
మృతులు జిలాన్, మహమ్మద్‌ గౌస్‌

సాక్షి, బొమ్మనహాళ్‌: శిద్దరాంపురంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయి కుమారుడు, రక్షించబోయి తండ్రి నీటమునిగి చనిపోయారు. ఎస్‌ఐ నాగమధు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జిలాన్‌ (35) లారీ డ్రైవర్‌గా వెళ్తూ పొలం పనులు కూడా చూసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం జిలాన్‌ తన కుమారుడు మహమ్మద్‌ గౌస్‌ (7)తో పాటు మరో బాలుడు ఆదివారం ఉదయం పొలం చూడటానికి వెళ్లారు.

అక్కడ ఉన్న వ్యవసాయ బావిలో నీటిని చూద్దామని ప్రయత్నించిన మహమ్మద్‌ గౌస్‌ అదుపుతప్పి నీటిలో పడ్డాడు. కుమారుడిని రక్షించేందుకని జిలాన్‌ వెంటనే బావిలోకి దూకాడు. ఇద్దరూ నీటిలో మునిగి పైకి రాలేకపోయారు. వెంట వెళ్లిన మరో బాలుడు కేకలు వేయడంతో గ్రామ సమీపంలోని ప్రజలు బావి వద్దకు చేరుకొని గాలింపు చేపట్టారు. ఎంతసేపటికీ ఆచూకీ లభించకపోవడంతో చివరకు గ్రామంలోని గజ ఈతగాళ్లను పిలిపించారు. మధ్యాహ్నానికి తండ్రీకొడుకులు జిలాన్, మహమ్మద్‌ గౌస్‌ల మృతదేహాలు వెలికితీశారు. వీరు బురదలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. జిలాన్‌కు భార్య ఫరీదా, కుమార్తె రోషిణి ఉన్నారు. ఎస్‌ఐ నాగమధు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు