మహిళా కండక్టర్‌పై స్వామిజీ దాడి

17 Jul, 2018 12:23 IST|Sakshi

కొలిమిగుండ్ల(కర్నూలు) : విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై సోమవారం ఓ స్వామిజీ దాడికి పాల్పడ్డాడు. నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఉదయం తాడిపత్రికి బయలుదేరింది. ఆ బస్సులో వైఎస్‌ఆర్‌ జిల్లా కడపకు చెందిన కండక్టర్‌ బూరుగల సుబ్బలక్ష్మి విధులు నిర్వర్తిస్తున్నారు. మార్గంమధ్యలో ఇటిక్యాల గీతాశ్రమానికి చెందిన జయదేవ్‌స్వామి బనగానపల్లెలో బస్సు ఎక్కాడు. కొలిమిగుండ్ల వరకు టికెట్‌ తీసుకోవడంతో స్టేజీ రాగానే దిగాలని కండక్టర్‌ సూచించారు. అందుకు అంగీకరించని స్వామి తాను ఇటిక్యాలలో దిగుతానని పట్టుబట్టాడు.

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు కావడంతో టికెట్‌ తీసుకున్న స్టేజీలోనే దిగాలని పేర్కొన్నా పట్టించుకోలేదు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సు జమ్మలమడుగు క్రాస్‌ రోడ్డు వద్దకు చేరగానే ఆవేశంతో ఊగిపోయిన ఆయన కండక్టర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు అడ్డుకుని జయదేవ్‌స్వామికి దేహశుద్ధి చేశారు. బస్సును కొలిమిగుండ్ల స్టేషన్‌కు తీసుకొచ్చి కండక్టర్‌ స్వామిపై ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు