క్వారీలో బ్లాస్టింగ్‌..ఇద్దరి మృతి

21 Sep, 2019 08:24 IST|Sakshi
క్వారీలో బ్లాస్టింగ్‌ కారణంగా బండరాళ్ల మధ్య పడిపోయిన మృతదేహాలు

కీసర: క్రషర్‌ మిషన్‌ క్వారీ వద్ద జరిగిన బ్లాస్టింగ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలోని గుట్టకమాన్‌ వద్ద గల ఎస్‌ఎల్‌ఎంఐ క్రషర్‌ మిషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన అన్నారం బాల్‌రాజ్‌ (36), గువ్వల బాల్‌రాజ్‌(32)లు ఇరువురు క్రషర్‌మిషన్‌లో సూపర్‌వైజర్లుగా పనిచేస్తుంటారు.

ఈమేరకు వీరు శుక్రవారం సాయంత్రం క్వారీ వద్ద బ్లాస్టింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బ్లాస్టింగ్‌ చేసే ముందు క్వారీ వద్ద  పరిసరాలను పరిశీలించేందుకు ఇద్దరు క్వారీ సమీపంలోకి వెళ్లారని, ఇంతలోనే  ఒక్కసారిగా బ్లాస్టింగ్‌ కావడంతో ఇద్దరు అక్కడికక్కడే బండరాళ్ల మధ్యలో ఇరుక్కొని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా బ్లాస్టింగ్‌ జరగడానికి గల కారణాలు పూర్తిగా తెలియరావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా వీరు క్వారీ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి మెరుపులు రావడంతో బ్లాస్టింగ్‌ కోసం ఏర్పాటు చేసి విద్యుత్‌ వైర్లకు విద్యుత్‌సరఫరా అయి బ్లాస్టింగ్‌ జరిగిందని తోటి కార్మికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల్లో అన్నారం బాలరాజ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నట్లు, గువ్వల బాల్‌రాజ్‌ భార్య గర్బవతి అని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు