బండి సంజయ్‌ను మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది: విజయశాంతి

18 Nov, 2023 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని అర్థమైందన్నారు. కాంగ్రెస్‌ నేత, సినీ నటి విజయశాంతి. వారు తెర ముందు విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను  తొలగించవద్దని తాము కోరినట్లు తెలిపారు. అయితే బండి సంజయ్‌ను మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందని అన్నారు. కేసీఆర్‌ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్‌ను మార్చేసిందని విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఉన్న నేత అసైన్డ్‌ భూములు ఏమయ్యాయి, కేసు ఏమైందని ప్రశ్నించారు,

సీఎం కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానన్న విజయశాంతి.. ఏళ్లు గడచినా  చర్యలు తీసుకోలేదని తెలిపారు. మేడిగడ్డ కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆధారాలు ఉండి కూడా కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాలేదన్నారు. 
చదవండి: కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా హరీష్‌రావుకు ఉందా?: ఈటల

మరిన్ని వార్తలు