స్కూటర్‌ ప్రమాదంలో మహిళ మృతి

15 Jun, 2018 13:23 IST|Sakshi
మరణించిన హుస్సేనమ్మ

మరొకరికి గాయాలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ, సుధీర్‌

జమ్మలమడుగురూరల్‌: ప్రొద్దుటూరు రహదారిలోని దానవులపాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగులోని కన్నెలూరుకు చెందిన డి. హుసేనమ్మ( 50) మృతి చెందింది. ఆమె కుమారుడు హుసేనయ్య గాయాలపాలయ్యాడు. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు..  కన్నెలూరు గ్రామానికి చెందిన హుసేనమ్మకు గత కొంత కాలం నుంచి ఆరోగ్యం సరిగా లేదు. గురువారం సాయంత్రం కుమారుడు హుసేనయ్యతో కలసి స్కూటర్‌లో దువ్వూరు గ్రామంలో ఉన్న దర్గాకు వెళుతుండగా మార్గమధ్యలో జమ్మలమడుగు మండలంలోని దానవులపాడు గ్రామం వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించబోయి స్కూటర్‌ అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో హుసేనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు హుసేనయ్యకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే 108 ద్వారా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. డాక్టర్లు పరీక్షించి హుసేనమ్మ చనిపోయినట్లు  తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కొండారెడ్డి తెలిపారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అవినాష్‌రెడి, సుధీర్‌రెడ్డి
 కన్నెలూరు గ్రామానికి చెందిన హుసేనమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలు ప్రభుత్వ ఆసుపపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న హుసేనయ్యను పరామర్శించారు. అనంతరం జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు