మహిళ గొంతు నులిమి హత్య

22 Nov, 2019 13:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేరం ఒప్పుకున్న మాజీ ప్రియుడు

చెన్నై: తిరుమంగై అనే మహిళను గొంతు నులిమి హత్య చేశానని ఆమె మాజీ ప్రియుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. నామక్కల్‌ జిల్లా రామపుదూర్‌కు చెందిన రమేష్, తిరుమంగై(33) ఓ హోటల్లో పనిచేసేవారు. 5నెలల కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తిరుమంగై తన పిన్ని వాళ్లతో కలిసి యోగనూర్‌లోని గుడికి వెళ్లొస్తానని భర్తకు చెప్పింది. తర్వాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. గురువారం తిరుప్పూర్‌ జిల్లా తారాపురం సమీపంలో అమరావతి నది పక్కన పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా కేసును చేదించారు.

సేలం అమ్మాపేటకు చెందిన ధనపాల్‌(24)ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి కథనం మేరకు.. నామక్కల్‌లో తిరుమంగై రాత్రివేళల్లో టిఫిన్‌ దుకాణం నిర్వహించేది. అప్పుడే జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనపాల్‌కు ఆమె పరిచయమైంది. అయితే తర్వాత రమేష్‌ను ఆమె పెళ్లిచేసుకోవడంతో ధనపాల్‌ కక్ష పెంచుకున్నాడు. తిరుమంగైకి ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు. నమ్మి వచ్చిన ఆమెను అమరావతి నది దగ్గరకు తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. నేరం అంగీకరించిన ధనపాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు