సాక్షి, చిత్తూరు : ప్రియురాలితో పెళ్లి జరగకుండా ఆమె తల్లిదండ్రులు అడ్డుకున్నారన్న ఆవేదనతో ఓ యువకుడు సెల్టవర్ ఎక్కాడు. తన ప్రియురాలితో పెళ్లి చేయాలని, లేకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లెకు చెందిన వినోద్ అనే యువకుడు అదేప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వినోద్ ప్రియురాలు అతడి ఇంటికి చేరుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన యువతి తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లిపోయారు.
దీంతో మనస్తాపానికి గురైన వినోద్ సాయంత్రం కొంగరెడ్డిపల్లిలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కాడు. తన ప్రియురాలితో పెళ్లి చేయాలని, లేకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్ఫోన్ ద్వారా వినోద్తో చర్చలు జరుపుతున్నారు.