చాకచక్యంగా తప్పించుకున్న ప్రసాద్‌ తల్లి సుశీల

20 Dec, 2023 09:52 IST|Sakshi

ఖలీల్‌వాడి/మాక్లూర్‌: ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్‌ ఆది నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మొదట తన మేనమామ కుంటి లస్మనతోనే ప్రారంభించాడు. బ్యాంకులో మార్టిగేజ్‌ లోన్‌ ఇప్పిస్తానని నమ్మబలికి రెండేళ్ల క్రితం మామ దగ్గర నుంచే రూ. 40వేలు తీసుకుని మాక్లూర్‌లోని అర ఎకరం భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అనంతరం గ్రామంలో అశోక్‌ అనే వ్య క్తి వద్ద నుంచి సైతం మరో అర ఎకరం భూమిని తన పేరిట మార్పించుకుని అమ్ముకున్నాడు. మోసా లు చేస్తూ సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ గ్రామంలో తన పేరు చెప్పుకునేలా చేసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత మాక్లూర్‌ రప్పించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరాడు. అప్పటి నుంచి జీవన్‌రెడ్డి పేరు చెప్పి మరిన్ని మోసాలకు తెరతీశాడు. అశోక్‌ భూమిని విక్రయించగా వచ్చిన రూ. 20 లక్షలతో ఒక కారు, జేసీబీ, టిప్పర్‌ను కోనుగో లు చేసి గ్రామంలో హల్‌చల్‌ చేశాడు. అశోక్‌ భూమి విక్రయించుకున్న విషయం బయటపడడంతో బాధితుడు ప్రశాంత్‌ను నిలదీశాడు. దీంతో తన పేరిట చేయించుకున్న లస్మన్న భూమిని అశోక్‌కు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చాడు. విషయం తెలియడంతో గ్రామస్తులు దూరంగా పెట్టారు.

ఈ క్రమంలో అప్పులు చేసి కొంతకాలం జల్సాలు చేశాడు. కారు, టిప్పర్‌, జేసీబీల ఈఎంఐలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్లు వాటిని తీసుకెళ్లిపోయారు. ఇదే సమయంలో కువైట్‌లో ఉండే ప్రసాద్‌ తన ఇంటిని విక్రయించాలని ప్రశాంత్‌ను సంప్రదించాడు. ఇదే అవకాశంగా భావించిన ప్రశాంత్‌ సుమారు రూ. 25 లక్షల విలువ చేసే ఇంటిని తానే కొనుగోలు చేస్తా నని నమ్మబలికాడు. తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలని.. లోన్‌ తీసుకుని కువైట్‌ నుంచి రాగానే డబ్బులు ఇస్తానని ప్రసాద్‌కు చెప్పాడు. దీంతో ప్రసాద్‌ కుటుంబ సభ్యులు ఇల్లును రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారు.

డబ్బులు ఇవ్వకపోవడం, ఇల్లును తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించి ఇవ్వకపోవడంతో ప్రసాద్‌ ప్రశాంత్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో ఇల్లును కాజేసేందుకు ప్లాన్‌ చేసిన ప్రశాంత్‌ కుటుంబ సభ్యులందరినీ అడ్డు తొలగించుకుంటే అడిగే వారు ఎవరూ ఉండరని భావించి ప్రణాళిక ప్రకారమే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

15 రోజుల క్రితం గొడవ..
తనకు ఇబ్బందులు ఉన్నాయని.. ఇంటి డబ్బులు చెల్లించాలని ప్రశాంత్‌పై ప్రసాద్‌ ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రశాంత్‌ 15 రోజుల క్రితం ప్రసాద్‌ నివాసం ఉంటున్న మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామానికి వెళ్లి అతనితో గొడవకు దిగినట్లు తెలిసింది. అనంతరం ప్రసాద్‌ తన తల్లి సుశీలకు ఫోన్‌ చేసి ప్రశాంత్‌ తనతో గొడవ పడినట్లు చెప్పాడు. రెండు మూడు రోజులు తర్వాత ప్రసాద్‌ మాక్లూర్‌కు వచ్చి ప్రశాంత్‌ను డబ్బులు అడిగాడు. అనంతరం తల్లి ఇంటికి వెళ్లి మాచారెడ్డికి వెళ్తున్నానని చెప్పాడు. కానీ ఆ రోజు నుంచి ప్రసాద్‌ కనిపించకుండా పోయినట్లు సమాచారం. అనంతరం ప్రసాద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను నిందితుడు వరుసగా హతమార్చినట్లు తెలుస్తోంది. సదాశివనగర్‌లోని భూంపల్లిలో స్వప్న హత్య ఘటనను పోలీసులు విచారించడంతో ప్రసాద్‌ కుటుంబ సభ్యుల వరుస హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది.

నిందితుల అరెస్టు
కామారెడ్డి క్రైం: ఆరుగురి హత్య కేసులో ఐదుగురు నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రశాంత్‌, బానోత్‌ వంశీ, గుగులోత్‌ విష్ణులతో పాటు ప్రశాంత్‌ తమ్ముడు, తల్లిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో మైనర్‌ను నిజా మాబాద్‌లోని జువైనల్‌ హోంకు పంపించారు.

మాదాపూర్‌ అడవుల్లో ప్రసాద్‌ మృతదేహం?
మాక్లూర్‌ మండలం మా దాపూర్‌ అటవీ ప్రాంతంలో ప్రసాద్‌ మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు నిందితుడు ప్రశాంత్‌ను రిమాండ్‌కు తరలించా రు. పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ప్రసాద్‌ మృతదేహాన్ని వెలికితీసే అవకాశాలున్నాయి. ప్రసాద్‌ భార్య రమణి మృతదేహం ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఆమె మృతదేహాన్ని బాసర గోదావరిలో పడేశారా.. లేదా మరెక్కడైనా పడేశారా అనేది పోలీసులు గుర్తించాల్సి ఉంది. ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, స్రవంతి, ఇద్దరు కవల పిల్లలు చైత్రిక్‌, చైత్రిక మృతదేహాలు లభించాయి.

>
మరిన్ని వార్తలు