పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
పోక్సో చట్టం కింద కేసు
యువకుడి కోసం గాలింపు
చీపురుపల్లి : అభం శుభం తెలియని ఓ పది హేనళ్ల బాలికను మాయమాటలతో ప్రేమ ముగ్గులోకి దించాడు ఓ యువకుడు. తాను చెబితే నడుచుకునేటట్టు చేశాడు. తనకు అనుకూలంగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో నమ్మించాడు. కొద్దికాలంగా జరుగుతున్న ఈ తంతును చివరికి బాలిక తల్లిదండ్రులు పసిగట్టారు. పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న యువకుడు పరారీ అయ్యాడు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.
దీనికి సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత మంగళవారం వెల్లడించిన వివరాలు... చీపురుపల్లి పట్టణానికి చెందిన 15 సంవత్సరాల బాలిక గరివిడిలోని ఓ పాఠశాలలో గడిచిన విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదివింది. రోజూ చీపురుపల్లి నుంచి గరివిడి పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఆ బాలికను గరివిడికి చెందిన కె.రామ్వర్మ(22) అనే యువకుడు మాయ మాటలు చెప్పి నమ్మించి ప్రేమలో దింపాడు.
బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా ఆమెకు సెల్ఫోన్ కూడా ఇచ్చాడు. దీంతో పాఠశాలకు వెళ్లే సమయంలో...సెల్ఫోన్లోనూ బాలికతో ప్రేమాయణం సాగించాడు. చివరకు విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చీపురుపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను నమ్మించి మోసం చేసినందుకు పోక్సో చట్టం ప్రకారం రామ్వర్మపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సౌమ్యలత తెలిపారు. మోసం చేసిన రామ్వర్మ పరారీలో ఉన్నాడని అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు చెప్పారు.