బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన 12 మంది సస్పెన్షన్

1 Sep, 2015 20:44 IST|Sakshi

పాల్వంచ (ఖమ్మం): తప్పుడు ధ్రువపత్రాలతో ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) 5,6 దశల కర్మాగారంలో ఉద్యోగాలు పొందిన 12 మంది జేపీఏ (జూనియర్ ప్లాంట్ అటెండెంట్)లు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2013 జూలైలో జెన్‌కో సంస్థలో 1295 మంది జేపీఏలుగా ఉద్యోగాలు పొందారు. అందులో 446 మంది కేటీపీఎస్ కర్మాగారానికి నియమితులయ్యారు. అయితే రిక్రూట్‌మెంట్ సమయంలో తప్పుడు ఏజెన్సీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందారని గిరిజన సంఘాలు జిల్లా కలెక్టర్‌కు, జెన్‌కో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు, సర్టిఫికెట్లను తిరిగి రెవెన్యూ అధికారులు పరిశీలించారు. దీంతో 12 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీంతో వారిని సస్పెండ్ చేయాలని ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ ఇలంబరితి జెన్‌కో యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేటీపీఎస్ 5,6 అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. 25 నెలల పాటు విధుల నిర్వహించిన అనంతరం వీరు సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయంశంగా మారింది. తప్పుడు ఆధారాలతో రెవెన్యూ అధికారులను పక్కదోవ పట్టించిన 12 మందిపై పోలీసు కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు