పెళ్లింట విషాదం

3 Mar, 2017 23:25 IST|Sakshi
  • బైక్‌ను ఢీకొన్న ఆటో : యువకుడి దుర్మరణం  
  • తల్లడిల్లిన తల్లిదండ్రులు
  • ఒక వైపు కుమార్తె కల్యాణం, మరొక వైపు కుమారుడి మరణం
  • కావలిరూరల్‌ : అప్పటి వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి నెల కొంది. ఇంటి నుంచి కల్యాణ మండపానికి అందరూ చేరుకున్నారు. అంతలోనే ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అక్క పెళ్లి ఏర్పాట్లల్లో మునిగిపోయిన తమ్ముడు కల్యాణ మండపానికి చేరకుండా యమపురికి పయనమయ్యా డు. పెళ్లి మండపం నుంచి బంధువులు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాద సంఘటన మండలంలోని సిరిపురం క్రాస్‌రోడ్డు మలుపు వద్ద గురువారం జరిగింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం అమ్మవారిపాళెంకు చెందిన జనిగర్ల మల్లికార్జున, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తె భాగ్యలక్ష్మికి గురువారం కావలిలోని ఒక కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉంది.

    దీంతో వారి చిన్న కుమారుడు వేణుగోపాల్‌ (20) కొన్ని రోజులుగా అక్క పెళ్లి ఏర్పాట్లు పనులు చేస్తూ హడావుడి చేశాడు. గురువారం ఉదయం పెళ్లి కోసం మల్లికార్జున కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కావలికి బయలుదేరారు. వేణు తన బంధువైన కరేడుకు చెందిన అశ్వనిని బైక్‌పై ఎక్కించుకుని కావలికి వస్తుండగా సిరిపురం క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చే సరికి కావలి నుంచి సిరిపురం వెళ్తున్న ఆటో మలుపు వద్ద బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో వేణు, అశ్వనిలకు తీవ్రగాయాల య్యాయి. వీరిని 108 సహాయంతో స్థానికులు కావలికి తరలించారు.

    అశ్వనిని కావలి ఏరియా హాస్పిటల్‌లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. వేణును నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. వేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కావలి రూరల్‌ ఎస్సై అళహరి సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పచ్చని తోరణాలు కట్టి మంగళమేళాలు మోగిన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.   

మరిన్ని వార్తలు