డెంగీతో వివాహిత మృతి

27 Sep, 2016 23:38 IST|Sakshi
సూర్యచంద్రరావుపేట(ద్వారకాతిరుమల) : డెంగీతో ఓ వివాహిత మరణించింది. ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..  మండలంలోని సూర్యచంద్రరావుపేటకు చెందిన సర్నాల నాగలక్ష్మి(27)కి 20 రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. స్థానికంగా చికిత్స పొందడంతో జ్వరం తగ్గింది. ఈ నేపథ్యంలో గత శనివారం  ఆమెకు భరించలేనంతగా తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సనందించిన వైద్యులు డెంగీ అని నిర్ధారించి గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సోమవారం రాత్రి నాగలక్ష్మిని గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం మృతిచెందింది.  వైద్యులు ఆమెకు డెంగీ జ్వరం సోకినట్టు నిర్ధారించారని ఆమె భర్త రాంబాబు చెప్పారు. నాగలక్ష్మి మృతితో గ్రామం ఉలిక్కిపడింది.  విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్‌  తలారి వెంకట్రావు, పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి చెలికాని రాజబాబు, నాయకులు బుసనబోయిన సత్యన్నారాయణ, మానుకొండ సుబ్బారావు, గుర్రాల లక్ష్మణ్‌ తదితరులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. 
 
మరిన్ని వార్తలు