అధికారుల పెత్తనాన్ని ఊరుకోం

3 Aug, 2016 21:36 IST|Sakshi
అధికారుల పెత్తనాన్ని ఊరుకోం
ఏలూరు (మెట్రో): జిల్లాలోని అన్ని మండలాల్లో, పంచాయతీల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాదని అధికారులు పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ అధికారాలను హరించే 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులను నిరోధించి స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కలెక్టర్‌ కె.భాస్కర్‌కు బాపిరాజు ఆధ్వర్యంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం జెడ్పీ చైర్మన్‌ విలేకరులతో మాట్లాడుతూ మండలాల స్థాయిలో ఏ పథకాన్ని ఏ లబ్ధిదారునికి అందించాలనే విషయం స్థానిక ప్రజాప్రతినిధులకే తెలుస్తుందని చెప్పారు ఈ విషయంలో అధికారులు తామే చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు కేటాయిస్తూ మండల పరిషత్‌లను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారనే విషయాలను కలెక్టర్‌కు విన్నవించుకున్నామని చెప్పారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, జెడ్పీటీసీలు చలపతిరావు, గంటా సుధీర్‌బాబు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
  
 
 
 
మరిన్ని వార్తలు