యాదగిరిగుట్ట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్తపేర్లతో ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. తొలి సారిగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిధులు ఏ మాత్రం ప్రకటించకున్నా తనపై సీబీఐ కేసులు బయటకి రాకుండా ఉండడానికే సీఎం ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన శక్తులే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, గుడ్ల వరలక్ష్మీ, కలకుంట్ల బాలనర్సయ్య, పెలిమెల్లి శ్రీధర్గౌడ్, తంగళ్లపల్లి సుగుణాకర్, కానుగు బాలరాజు, షంషీర్పాషా, బొజ్జ సాంబేష్ ఉన్నారు.