గజ్వేల్‌ వేదికగా మరో పోరు

11 Sep, 2016 21:43 IST|Sakshi
గజ్వేల్‌లో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు
  • మల్లన్నసాగర్‌ బాధితుల సంఘీభావ సభ
  • ఏర్పాట్లను పరిశీలించిన దామోదర, సునీతారెడ్డి
  • గజ్వేల్‌: మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు మద్దతుగా కాంగ్రెస్‌ మరో పోరుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ కేంద్రంగా సోమవారం సంఘీభావ సభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. పట్టణంలోని దొంతుల ప్రసాద్‌ గార్డెన్‌ వేదికగా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    2013 భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌  వేములఘాట్‌లో రిలే దీక్షలు వందో రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తోంది. సభలో  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు హాజరు కానున్నారు. ఉదయం 11గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా  గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. 

    సభ నిర్వహణ ఏర్పాట్లను ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పరిశీలించారు.  కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి హజారి వేణుగోపాల్‌రావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గాలెంక నర్సింలు, యూత్‌కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్ధార్‌ఖాన్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కుంట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు