రాజస్థాన్ ఎన్నికలు: కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ కీలక వ్యాఖ్యలు

22 Nov, 2023 11:53 IST|Sakshi

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్‌  నేత  మాజీ డిప్యూటీ స్పీక‌ర్ స‌చిన్ పైల‌ట్ మధ్య నెలకొన్న టెన్షన్‌ నేపథ్యంలో పైలట్‌ కీలక  వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో గత 30 ఏళ్లుగా ఎన్నికల్లో వరుసగా ఎందుకు గెలవ లేకపోతున్నామో  కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని  ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ మాట్లాడుతూ రాజస్థాన్‌లో 30 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో గెలుపొందలేదు. దీనికి కారణం ఏంటి అనే దానిపై  ఆత్మపరిశీలన చేసుకోవాలి.  అయితే ప్రస్తుత ఎన్నికల్లో  కాంగ్రెస్‌  దీన్ని బ్రేక్‌ చేస్తుందని పేర్కొనడం గమనార్హం. 

రాజస్థాన్ ఎన్నికల్లో  కాంగ్రెస్  గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.  సామాజిక సంక్షేమం , పెట్టుబడులు, సంపద సృష్టిపై దృష్టిపెట్టాం. అసమాతనలు లేని రాజస్థాన్ కావాలి. యువతకు  ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అలాగే బీజేపీ "డబుల్ ఇంజిన్" ప్రభుత్వంపై కూడా  మండిపడ్డారు. రాష్ట్ర అగ్ర నాయకత్వం మధ్య విభేదాలపై స్పందిస్తూ తాము స‌మిష్టిగా ఎన్నిక‌ల్లో పోరాడ‌తామని, ఇక పదవులు ఎంపిక  హైక‌మాండ్  చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.

అలాగే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా మేరకు తాను ‘క్షమించండి, మరచిపోయి ముందుకు సాగండి’ ఈ మంత్రాన్ని అనుసరిస్తున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్‌ని ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ గతంలో తానేం  మాట్లాడినా దానికి  బాధ్యత వహిస్తాననీ, రాజకీయ చర్చల్లో  గౌరవాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

కాగా గత కొన్ని ఎన్నికల్లో రాజస్థాన్ అధికార  పీఠం బీజేపీ, కాంగ్రెస్  పార్టీ మధ్య హోరీ హోరీ పోరు ఉంటుంది.   ఒకసారి బీజేపీ పైచేయి సాధిస్తే, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. ఇపుడు  రాజకీయ విశ్లేషకులు ఈ లెక్కల్ని నిశితంగా గమనిస్తున్నారు.  రాజ‌స్ధాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ నెల 25న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు, అధికారం చేపట్టిన పార్టీలు
1993 - బీజీపీ 
1998 - కాంగ్రెస్‌
2003 - బీజేపీ
2008 - కాంగ్రెస్‌
2013 - బీజేపీ
2018 - కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు