అద్దెలు పెంచితే కఠిన చర్యలు: చంద్రబాబు

27 May, 2016 07:40 IST|Sakshi
అద్దెలు పెంచితే కఠిన చర్యలు: చంద్రబాబు

ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు పెంచితే కఠిన చర్యలు
జూన్ 27 లోగా అమరావతి నుంచే పరిపాలన సాగించాలి
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు


సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెల భారం పెంచి ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని, అద్దె నియంత్రణ చట్టాన్ని ప్రయోగిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ జూన్ 27 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత రాష్ట్రం నుంచే పరిపాలన సాగించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్‌ఈడీ బల్బుల వాడకం మొదలుపెట్టాలని,  ప్రభుత్వ సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలన్నారు.

బకింగ్‌హామ్ కెనాల్ ప్రాజెక్టు అభివృద్ధికి సీఈవో స్థాయి అధికారిని నియమించాలని సూచించారు. ఇకపై వారానికోసారి గృహ నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తానన్నారు. 15 రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యేక యూత్ పాలసీని రూపొందించి మంత్రివర్గం ఆమోదానికి సమర్పించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు జపాన్‌లో రోడ్‌షో నిర్వహిస్తామన్నారు.
 
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి
భవిష్యత్తులో ఎదురయ్యే కొత్త తరహా సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖకు సూచించారు. రెండోరోజు గురువారం కలెక్టర్ల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్షించారు. ప్రభుత్వం, పోలీసులు మెతగ్గా ఉన్నారనే అభిప్రాయం వస్తే అసాంఘిక శక్తులు విజృంభిస్తాయన్నారు. శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వెహికల్ స్కానర్లు, డ్రోన్లు ఉపయోగించాలని సూచించారు.

మరిన్ని వార్తలు