అనంతపురం అగ్రికల్చర్ : ప్రమాదకరమైన బర్డ్ఫ్లూ వ్యాధిపై పశువైద్యులు నిఘా పెంచాలని పశు సంవర్ధకశాఖ 'అనంత' డివిజన్ ఏడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్, సాయినగర్ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర అన్నారు. గురువారం స్థానిక డివిజన్ ఏడీ కార్యాలయంలో 14 మండలాల పశు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏడీలు మాట్లాడుతూ కర్ణాటకలోని బెల్గాం తదితర ప్రాంతాల్లో బర్డ్ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించినందున, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో లక్షణాలు ఎక్కడా కనిపించకున్నా ప్రాణాంతకమైన వ్యాధిని అరికట్టే క్రమంలో కోళ్ల ఫారాలను పరిశీలించి, అనుమానంగా ఉన్న వాటి నుంచి నమూనాలు తీసి పంపాలని ఆదేశించారు. కోళ్లకు వ్యాపించిన తర్వాత ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నందున హెచ్–1–ఎన్–1 వైరస్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కోళ్లు, వణ్యప్రాణులు, వలస పక్షులపై నిఘా పెంచాలన్నారు. ఈ వ్యాధి పరిశీలనకు వచ్చే నెల జాతీయ స్థాయి బృందం పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 3న వెటర్నరీ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రుల పరిధిలో గర్భకోశవ్యాధి ఉన్న 100 పశువులు, రైతుల వివరాలు అందజేయాలన్నారు.కరువు సహాయక చర్యల్లో భాగంగా దాణా, టీఎంఆర్ బ్లాక్స్, సైలేజ్ బేల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులను గుర్తించి గడ్డిని సైలేజ్ బేల్స్ తయారీకి ఇచ్చేలా ఒప్పించాలని సూచించారు.