నక్సల్స్ పేరుతో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దమ్మాయిగూడలోని ఆదిత్య ఆస్పత్రి యాజమాన్యానికి గురువారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. తాను మావోయిస్టు నేత శ్రీను అని పరిచయం చేసుకున్న ఆవ్యక్తి... వెంటనే రూ.50 లక్షలు ఇవ్వకుంటే ఆస్పత్రి భవనాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీనిపై యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.