‘ప్రపంచ శాంతికి వారధి భారతీయ సంస్కృతి’

12 Jan, 2017 03:05 IST|Sakshi

శ్రీకాకుళం: విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించే సనాతన ధర్మమే భారతీయ సంస్కృతి అని, ప్రపంచ శాంతికి వారధిలా భారతీయ సంస్కృతి దోహదపడుతుందని తెలుగుతల్లి చైతన్య సమితి అధ్యక్షుడు యర్నాగుల వేంకట రమణారావు అన్నారు. స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో సెట్‌శ్రీ సౌజన్యంతో యంగ్‌ ఇండియా సారథ్యంలో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల 6వ రోజు కార్యక్రమాన్ని హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో... స్థానిక చందు హిందీ పండిత శిక్షణ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన భారతీయ సంస్కృతి అనే అంశంపై మాట్లాడారు. ‘బేటీ పడావో–బేటీ బచావో’ జిల్లా కన్వీనర్, ప్రముఖ మహిళా న్యాయవాది కద్దాల ఈశ్వరమ్మ మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రభోదాలను యువత అనుసరించాలన్నారు.

 విశ్వగురువుగా భారత రూపు దిద్దుకోవాలని ఆకాంక్షించారు. హిందీ వికాస వేదిక అధ్యక్షుడు బాడాన దేవేభూషణరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి యంగ్‌ ఇండియా డైరెక్టర్‌ మందపల్లి రామకృష్ణారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్యామసుందరరావు, వివేకానంద సేవా సమితి సభ్యులు సోపింటి జగదీష్, కళాశాల అధ్యాపకులు ఎం. ఈశ్వరరావు, లావేటి కృష్ణారావు, రావాడ శ్రీనివాసరావు, ఎం. షణ్ముఖరావు, టి. అనిల్‌కుమార్, ఎల్‌. భార్గవనాయుడు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు స్వామి వివేకానంద, సోదరి నివేదిత చిత్ర పటాలకు జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు.

మరిన్ని వార్తలు