యల్లాయపాలెం(కొడవలూరు) : బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన మండలంలోని యల్లాయపాలెంలో శనివారం రాత్రి చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మసీదు వీధికి చెందిన ఓ బాలికకు (15) మేనమామ వరుసైన వ్యక్తితో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 26వ తేదీన పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. వివాహ శుభలేఖలు ముద్రించి పంపిణీ ప్రారంభించారు. వివాహ విషయం ఐసీడీఎస్ సూపర్వైజర్ సాయికుమారి దష్టికి వెళ్లడంతో ఆమె ఐసీపీఎస్ అధికారిణి సుజాతతో కలిసి శనివారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేశారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరమని, అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేసి వివాహం జరిపితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహం రద్దు చేసుకునేందుకు అంగీకరించి అందుకు కట్టుబడి ఉంటామని అధికారులకు ఒప్పంద పత్రం రాసిచ్చారు.