బంజారాహిల్స్: బీర్ ప్రియులను ఊరిస్తున్న మైక్రో బ్రీవరీలు నగరానికి వచ్చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ‘ప్రోస్ట్’ (జర్మనీ భాషలో ఛీయర్స్ అని అర్దం) మైక్రో బ్రీవరి పబ్ ఏర్పాటు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. 10,000 చదరపు అడుగులు కలిగి 345 మంది సీటింగ్ కెపాసిటితో ‘ వింటేజ్ ఆటోమొబైల్’ థీమ్తో రూపొందిస్తున్న ఈ మైక్రో బ్రీవరీని సెప్టెంబర్ 1న ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా సంస్థ డైరెక్టర్లు తేజా చేకూరి, హర్ష, విధాత, సుబ్బరాజు, రాజ్కుమార్లు సాక్షితో మాట్లాడారు.
తెలంగాణా ప్రభుత్వం తాజా ఎక్సైజ్ పాలసీ, నిబంధనలకు అనుగుణంగా జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రీవరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆపిల్సైడర్, వీట్, బర్న్ట్, లార్జర్, ఎయిర్స్టౌట్, బ్రూవ్ స్పెషల్ పేర్లతో మొత్తం 6 రకాల రుచులతో రోజుకు ఒక్కొక్కటి 500 లీటర్ల సామర్ద్యంతో బీర్లు తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జర్మనీసహా పలు దేశాల నుండి బీర్లలో వాడే ముడిపదార్థాలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. బీరు రకాలను బట్టి 500 ఎంఎల్ గ్లాస్కు 270 నుండి 320 రూపాయల మధ్య ధరల శ్రేణి ఉంటుందన్నారు.
10 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ పబ్కు కెన్యాకు చెందిన బీరు తయారీ నిపుణుడు బ్రీవ్ మాస్టర్గా పనిచేయయనున్నట్లు తెలిపారు. తాము ఇప్పటికే 2012 నుండి బెంగళూర్లో మైక్రో బ్రూవరీని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఈ రంగంలో ఉన్న అనుభవంతో నగర బీరు ప్రియులకు అంతర్జాతీయస్థాయి రుచులను అందిస్తామని ధీమా వ్యక్తం చేసారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సహ పలువురు టాలీవుడ్ నటులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.