పరస్పర సహకారం అవసరం

22 Mar, 2017 22:13 IST|Sakshi
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి
కర్నూలు (లీగల్‌): న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర సహకారంతో కక్షిదారులకు సత్వర న్యాయం అందిద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సూచించారు. ఇటీవల బదిలీపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జీగా నియమితులైన వెంకటనాగసుందర్‌కు బుధవారం స్థానిక న్యాయవాదుల సంఘం కార్యాలయంలో స్వాగత సభ నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ విశాఖ నుంచి కర్నూలుకు వచ్చిన న్యాయమూర్తి నాగసుందర్‌ అభినందిస్తూ ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులకు ఎలాంటి సహకారం అందిస్తున్నారో నూతన న్యాయమూర్తికి అందించాలని కోరారు.
 
మొదటి అదనపు జిల్లా జడ్జీ వీవీ శేషుబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా న్యాయవాదులు కేసుల పరిష్కారానికి సహకరించారని అలాగే భవిష్యత్‌లో అందరికి సహకరించాలని కోరారు. నూతన న్యాయయూర్తి వెంకటనాగసుందర్‌ మాట్లాడుతూ కర్నూలుకు విశాఖకు అవినాభావ సంబంధం ఉందని ఇక్కడ పని చేసిన న్యాయమూర్తులు విశాఖకు, విశాఖలో పని చేసిన వారు ఇక్కడికి బదిలీ అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి రఘురాం, సబ్‌ జడ్జిలు శివకుమార్, గాయత్రిదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు పి.రాజు, గంగాభవాని, బాబు,  న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చాంద్‌బాషా, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, తిరుపతయ్య, అబ్దుల్‌ కరీం, సీనియర్, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు