‘చుక్క’లకు దక్కిన గౌరవం!

18 Jul, 2016 18:28 IST|Sakshi
టీ డికాషన్‌ చుక్కలతో వేసిన చిత్రం, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రం
  •  ‘గిన్నె’ చిత్రాలకు జాతీయ గుర్తింపు 
  • బాల్‌ పాయింట్‌ పెన్ను చుక్కలతో చిత్రాలు
  •  దేశవ్యాప్తంగా లెక్కకు మించి ప్రదర్శనలు
  •  ప్రముఖులతో అభినందనలు, సన్మానాలు
  • అడ్డాకుల : రంగులతో చిత్రాలు వేయడం.. పెన్సిల్‌తో బొమ్మలు గీయడం మాములే. కానీ బాల్‌ పాయింట్‌ పెన్నుతో చుక్కలు పెడుతూ బొమ్మలువేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిత్రానికి లక్షల చుక్కలు క్రమ పద్ధతిలో పెట్టాలి. ఒక్కచుక్క  అనుకున్న క్రమంలో లేకపోయినా రావాల్సిన భావంరాదు. కానీ బాల్‌ పాయింట్‌ పెన్నుతో అలవొకగా అనుకున్న భావం వచ్చేలా చిత్రాలు వేస్తున్నాడు గిన్నె వెంకటేశ్వర్లుసాగర్‌. తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతని ప్రతిభను చూసి రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు అభినందించారు..ప్రశంసించారు. అంతేనా జాతీయస్థాయిలో పలురికార్డుల్లో తనదైన స్థానం పొందిన గిన్నె వెంకటేశ్వర్లుసాగర్‌ది అడ్డాకుల మండలం మూసాపేట. ఆయన ప్రస్థానం ఇలా సాగింది..
     
    సాధారణ పెయింటింగ్‌తో మొదలై..
    మూసాపేటకు చెందిన గిన్నె రాములు, భీసమ్మ దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్వర్లు. సాధారణ చిత్రకారుడు. నిరుపేద కుటుంబం కావడంతో హైదరాబాద్‌లోని జగద్గీరి గుట్టలో ఫొటో స్టూడియో నడుపుతూ జీవనం సాగించేవాడు. పెయింటింగ్‌పై ఉన్న ఆసక్తితో బీఎఫ్‌ఏ పూర్తి చేశాడు. అదే సమయంలో పెన్సిల్‌తో వెలుగునీడల చిత్రాలు వేస్తూ మధ్యలో బ్లాక్‌ బాల్‌పాయింట్‌ రీఫిల్‌తో చుక్కలు వేశాడు. పెన్సిల్‌ చిత్రాలు కొంతకాలం తర్వాత పాడైపోతాయని, పెన్నుతో వేస్తే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయన్న ఆలోచన ఈసమయంలోనే కలిగింది. దీంతో చుక్కలతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. రంగురంగుల బాల్‌పాయింట్‌ పెన్నులతో ప్రయత్నించడం అతన్ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి చుక్కలతో పాటు టీ డికాషన్, రంగులను కలుపుతూ రకరకాల చిత్రాలు వేయడం కొనసాగించాడు. 
     
    తిరుపతిలో ఉద్యోగం రావడంతో..
    1984లో వెంకటేశ్వర్లుకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్పకళాశాలలో బోధకుడిగా ఉద్యోగం లభించింది. అక్కడ చుక్కల చిత్రాల్లో మరింత పరిణతిసాధించాడు. జాతీయ స్థాయిలో లెక్కకు మించి ప్రదర్శనలు ఇచ్చాడు. నాగ్‌పూర్, జైపూర్, బెంగళూర్, ఢిల్లీ, ఖజురహో, ఉదయ్‌పూర్, హైదరాబాద్, విశాఖపట్నం, భీమవరం, తిరుపతి, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో దాదాపు 20వన్‌మెన్‌ షోలు, 10 గ్రూప్‌ షోలు, 6 ఆర్ట్‌క్యాంప్‌లలో పాల్గొన్నాడు. 
     
    రికార్డుల్లో ‘చుక్క’లకు స్థానం 
    ఈక్రమంలోనే చుక్కల చిత్రాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. గ్లోబల్‌ వరల్డ్‌ రికార్డు(2011), ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు(2011)లో స్థానం సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మహాత్మాపూలే టాలెంట్‌ రీసెర్చ్‌ నేషనల్‌ అవార్డు(2012), న్యూఢిల్లీ స్కాలర్‌షిప్‌ అవార్డు(1997)లనూ అందుకున్నాడు. 
     
    ప్రముఖుల అభినందనలు
    ఇతని చుక్కల చిత్రాలు దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని కూడా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతులు అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధాన మంత్రి మన్మోçßæన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి, గవర్నర్లు రంగరాజన్, అమోలక్‌ రతన్‌కోహిల్‌(మిజోరాం), సుశీల్‌కుమార్‌ షిండే, సుర్జిత్‌సింగ్‌ బర్నాలా, ముఖ్యమంత్రులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు పదవుల్లో ఉన్నప్పుడు చుక్కలతో వారి చిత్రాలు వేసి వారికే బహూకరించాడు. దీంతో వారంతా వెంకటేశ్వర్లుసాగర్‌ను అభినందించారు. 
మరిన్ని వార్తలు