ఈ–టాయిలెట్లు వచ్చేశాయ్‌..

7 Sep, 2016 16:30 IST|Sakshi
ఈ–టాయిలెట్లు వచ్చేశాయ్‌..
*  స్వచ్ఛ గుంటూరులో భాగంగా ఏర్పాటు
* కాయిన్‌ వేస్తే డోర్‌ తెరుచుకుంటుంది...
 
గుంటూరు (నెహ్రూనగర్‌): స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నగరాన్ని స్మార్ట్‌ సీటీగా తీర్చిదిద్దేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఈ (ఎలక్ట్రానిక్‌) టాయిటెట్లు ఏర్పాటు చేసింది. నగరంలో పలు చోట్ల నగరపాలక సంస్థ టాయిలెట్లు  సౌకర్యవంతంగా  లేకపోవడం, నిర్వహణ అంతంత మాత్రంగా ఉండటంతో నగర ప్రజలకు కొత్త రకం టాయిలెట్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. 
 
రూ.40 లక్షలతో ఏర్పాటు..
ఈ టాయిలెట్లను కే రళకు చెందిన ఈ– రామ్‌ సైంటిఫిక్‌ కంపెనీ తయారు చేసింది.   ఒక్కొక్క దానికి రూ.8 లక్షల చొప్పున ఖర్చు చేసి 5 ప్రాంతాల్లో రూ. 40 లక్షలతోఈ టాయిలెట్లను   కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది.
 
ప్రధాన కూడళ్ళ వద్ద ఏర్పాటు..
జనం రద్దీగా ఉండే ప్రాంతాలైన పల్నాడు బస్టాండ్, కొల్లిశారదా మార్కెట్, గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, నగరపాలక సంస్థ ప్రాంతంలో ఏర్పాటు చే శారు. ఇప్పటికే గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, నగరపాలక సంస్థ తదితర ప్రాంతాల్లో ఈ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు. కొల్లిశారదా మార్కెట్, పల్నాడు బస్టాండ్‌ల వద్ద నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా కొద్ది కాలంలోనే వీటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు నగరపాలక సంస్థ అ«ధికారులు చెబుతున్నారు. 
 
బాక్టీరియా క్రిములతో..
ఈ టాయిలెట్ల ద్వారా  సెప్టిక్‌ ట్యాంక్‌లోకి వచ్చిన వ్యర్థాలను  బయటికి తరలించే శ్రమ ఉండదు. సెప్టిక్‌ ట్యాంక్‌లో బ్యాక్టీరియా క్రిములు వేయడంతో వ్యర్థాలను ఈ క్రిములు తినివేస్తాయి. చివరికి నీరు మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ నీరు కూడా టాయిలెట్ల పక్కనే ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు.   నగరంలో ప్రజల  నుంచి ఆదరణ వస్తే మరిన్ని టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలియజేశారు.
 
పనిచేస్తుందిలా..
ఈ టాయిలెట్లను రూ.1, 2, 5 కాయిన్‌లు వేసి ఉపయోగించాల్సి ఉంటుంది. వినియోగించేవారు ముందుగా ఆకుపచ్చ రంగు వెలుగుతున్నప్పుడు  ఈ కాయిన్‌లు వేస్తే ఆటోమేటిక్‌గా డోర్‌ తెరుచుకుంటుంది. ఒకరికి మాత్రమే వాడుకునే విధంగా దీనిని రూపొందించారు. 
 
సెన్సర్‌ పనిచేసేదిలా...
ఈ టాయిలెట్లలో లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా ఫ్యాన్, లైటు వెలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నీళ్ళు కొట్టే పని లేకుండా సెన్సర్ల సహాయంతో వేస్ట్‌ని నీటితో  శుభ్రం చేసుకుంటుంది. లోపల ఉన్న వ్యక్తికి అర్థమయ్యే విధంగా వాయిస్‌ డైరెక్షన్‌ కంప్యూటర్‌ చెబుతుంటుంది. 225 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంకును టాయిలెట్ల వద్ద అమర్చారు. నిత్యం నీటి సరఫరా ఉండే విధంగా వీటిని రూపొందించారు.
మరిన్ని వార్తలు