బంజారాహిల్స్: లక్ష్మీపూజ పేరుతో ప్రముఖ వ్యాపారవేత్త లైఫ్సై్టల్ మధుసూదన్రెడ్డిని బురిడీ కొట్టించి.. డబ్బుతో పరారైన దొంగబాబా ఆ రోజు ప్రసాదంలో కలిపింది మత్తు మందుతో పాటు విషపూరితమైన పదార్థమని తేలింది. ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు అందింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఏ మాత్రం ఆలస్యం చేసినా మధుసూదన్రెడ్డితో పాటు ఆయన భార్యకు ప్రాణాపాయం ఉండేదని నివేదికలో పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీ నివాసి లైఫ్ స్టైల్ మధుసూదన్రెడ్డి ఇంటిలో ఈ ఏడాది జూన్ 15న బెంగళూరు నుంచి వచ్చిన శివస్వామి అనే బాబా లక్ష్మీపూజ చేశాడు.
ఈ పూజ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని బాబా చెప్పడంతో వారు ఇంట్లో ఉన్న రూ.1.33 కోట్లు బ్యాగులో ఉంచి పూజా స్థలంలో పెట్టారు. పూజ ముగిశాక ఆ బాబా ఇచ్చిన ప్రసాదం తిన్న మధుసూదన్రెడ్డి దంపతులు కొద్దిసేపటికే మత్తులోకి జారుకోగా.. దొంగబాబా డబ్బు తీసుకొని ఉడాయించాడు. కాగా, పోలీసులు ఆ ప్రసాదాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపగా.. పరీక్షించిన ఎస్ఎఫ్ఎల్ అధికారులు ఆ ప్రసాదంలో ఉమ్మెత్తపువ్వుతో పాటు మత్తునిచ్చే హెర్బల్ పౌడర్ ఉందని తేల్చారు. ఈ మత్తు పదార్థం నరాల మీద తీవ్ర ప్రభావం చూపి.. ఆలస్యమయ్యేకొద్దీ ప్రాణాంతకంగా మారుతుందని తేల్చారు.