విఘ్ననాథుడికి విరి సేవ

21 Sep, 2016 23:53 IST|Sakshi
ఉభయదేవేరులకు ఊయలలో సేదతీరుతున్న వినాయకస్వామి
 
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి పూలంగి సేవ నేత్రపర్వంగా జరిగింది. సిద్ధి,బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పరిమళాలు వెదజల్లే దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించి ఊంజల్‌ సేవ నిర్వహించారు. భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం స్వామివారి మూల విగ్రహనికి విశేష అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించి  ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలోని అర్ధ, మూషిక, ఆన్వేటి, సుపథ మండపాలను పరిమళభరిత పుష్పమాలికలతో అలంకరించారు. రాత్రి 9గంటలకు సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిపై  అలంకార మండపానికి వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలు, దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆన్వేటీ మండపానికి వేంచేపు చేసి ఊయలలో కొలువుదీర్చి ఊంజల్‌ సేవ నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ ఉభయ దేవేరులతో సేదతీరుతున్న వినాయక స్వామిని దర్శించి భక్తులు పులకించారు. అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్‌ రవీంద్ర బాబు, ఇన్‌స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లి కార్జున పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాన వాహనసేవలకు విస్తృత ఏర్పాట్లు 
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాలలో భాగంగా  రేపటినుంచి జరిగే ప్రధాన వాహన సేవలకు  విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కల్పవృక్ష వాహనం, శుక్రవారం విమానోత్సవం, శనివారం పుష్పపల్లకి, ఆదివారం తెప్పోత్సవం జరుగునుంది. ఈఓ పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు జరుగుతున్నాయి. పుష్కరిణిని శుభ్రం చేసి కొత్త నీటిని నింపడం, విద్యుత్‌ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి.
 
 
 
మరిన్ని వార్తలు