హైవేపై గంజాయి హవా

19 Jul, 2016 23:14 IST|Sakshi
హైవేపై గంజాయి హవా
యథేచ్ఛగా జరిగిపోతున్న రవాణా
ప్రయాణికుల్లా వ్యవహరిస్తూ, తరలిస్తున్న స్మగ్లర్లు
అడపాదడపా పోలీసులకు పట్టుబడుతున్న వైనం
జాతీయ రహదారిపై గంజాయి రవాణా యధేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి మరీ సరుకును తరలించుకుపోతున్నారు. గత మూడు మాసాల్లో గంజాయి తరలిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేసి, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
– రాజానగరం
గంజాయి రవాణా చేస్తూ, పోలీసులకు పట్టుబడిన కేసులో బొమ్మూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు, రాజానగరం పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. గంజాయిని రవాణా చేసే స్మగ్లర్ల ప్రయాణికుల్లా కార్లలో వెళుతూ, ముందుగా ఒక ఎస్కార్ట్‌ తరహాలో వారి అనుయాయులను పంపుతారు. ఎక్కడా  సోదాలు లేవని వారిచ్చే సమాచారంతో, గంజాయి స్మగ్లర్ల ప్రయాణం ముందుకు సాగుతుంది. జాతీయ రహదారిలో పలుచోట్ల చెక్‌ పోస్టులున్నప్పటికీ, గంజాయి రవాణా చేసేవారు తెల్లవారుజామున పోలీసులు సైతం కాస్త కునుకు తీసే సమయంలోనో, ఇతర అవసరాలు తీర్చుకునే సమయంలోనో ఆ ప్రాంతాన్ని దాటేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. కొంతకాలంగా రాష్ట్ర సరిహద్దును కూడా గంజాయి దాటిపోతున్నట్టు తెలుస్తోంది. స్మగ్లర్లు రైళ్లలో కూడా గంజాయిని  రవాణా చేస్తున్నారు. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు.
మెట్టలోనే డంపిగ్‌ యార్డు
ఏజెన్నీ ప్రాంతాల నుంచి జిల్లాలోని మెట్ట ప్రాంతానికి గంజాయిని తరలించి, స్థానికంగా ఓSరహస్య ప్రాంతాన్ని డంపిగ్‌ యార్డుగా ఉపయోగించుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అందిన సమాచారంపై ఆరా తీస్తూ, ఆ ప్రాంతాన్ని, స్మగ్లర్లను పట్టుకునే పనిలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి గంజాయిని ప్యాకెట్లుగా తయారుచేసి, రహస్యంగా రవాణా చేస్తున్నారనే అనుమానాన్ని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు వ్యక్తం చేశారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నిందితులు వినియోగించుకుంటున్నారు.
రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఏలేశ్వరం : జాతీయ రహదారిపై యర్రవరం వద్ద మంగళవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.10 లక్షల విలువైన గంజాయి లభ్యమైంది. దీంతో పాటు రూ.44 వేల నగదును స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ సీఐ బి.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా జీకేవీధి మండలం పెదవలస గ్రామం నుంచి సుమారు రూ.10 లక్షలు విలువైన 634 కిలోల గంజాయిని వ్యా¯Œæలో జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి, అన్నవరంల్లో దింపేందుకు నిందితులు బయలుదేరారు. యర్రవరం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ అప్పారావుతో పాటు సిబ్బందికి బైక్‌పై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న విశాఖపట్నానికి చెందిన కె.దేవుడు, ఎల్‌.కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయగా, వెనుక వస్తున్న వ్యా¯Œæలో గంజాయి ఉన్నట్టు తెలిసింది. దీంతో వ్యా¯Œæలో ఉన్న గంజాయితో పాటు వ్యాన్‌ యజమాని, డ్రైవర్‌ ఎం.విజయసాయి, క్లీనర్‌ కె.దేవుడు, అదనపు డ్రైవర్‌ నరిసే అప్పారావును అరెస్టు చేశారు. విశాఖ జిల్లా కేడీపేటకు చెందిన సూరిబాబు తమకు గంజాయి అప్పగించాడని వారు తెలిపారు. ఎస్సై వై.రవికుమార్, ఏఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు.
316 కిలోల గంజాయి పట్టివేత
రాజానగరం : హైవేపై రవాణా చేస్తున్న 316 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దీని విలువ రూ.15.8 లక్షలు ఉంటుందని చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సూచనల మేరకు సోమవారం జాతీయ రహదారిపై గైట్‌ కళాశాల వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వ్యాన్‌లో గంజాయి పట్టుబడింది.  అనకాపల్లి అటవీ ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయిని కొని, వ్యాన్‌లో తమిళనాడుకు తరలిస్తున్నారు. వ్యాన్‌ వెనుక క్యాబిన్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో దాచిన 18 మూటల్లో ఉన్న గంజాయి లభ్యమైంది. దీనిని తరలిస్తున్న కర్ణాటకలోని కోలార్‌ జిల్లా రామంత్‌నగర్‌కు చెందిన షేక్‌ సలీమ్, తమిళనాడులోని తానె జిల్లా ఉత్తమపలయం తాలూకా చిన్నమనూర్‌కి చెందిన తంగవేలు రాము, మణి నివాస్‌ను అరెస్టు చే శారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.37,635 నగదును కూడా స్వాధీనపర్చుకున్నారు.
 
మరిన్ని వార్తలు