భార్యాబిడ్డలపై గొడ్డలితో దాడి.. ఆత్మహత్య

27 Mar, 2016 15:05 IST|Sakshi

అచ్చంపేట(మహబూబ్‌నగర్): కుటుంబ కలహాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను కత్తితో కిరాతకంగా నరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(46), దాలమ్మ 40 దంపతులకు నలుగురు సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన వెంకటయ్య భార్యతో పాటు పిల్లలను చంపేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భయపడిపోయిన దాలమ్మ పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టి భర్తతో వాదులాడుతుండగా.. కోపోద్రిక్తుడైన భర్త కత్తితో ఆమె పై దాడి చేశాడు. అనంతరం భార్య చనిపోయిందనుకొని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు