భార్య అంత్యక్రియల రోజే భర్త మృతి

26 Sep, 2015 22:39 IST|Sakshi

గార్ల: భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఆమె అంత్యక్రియలు ముగించుకొని వచ్చి.. అదే రోజు రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా గార్లలోని దంపకం బజారులో మాచర్ల సత్యనారాయణ(48), రాణి(43) దంపతులు కంసాలి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం వీరు విజయవాడ నుంచి బతుకుదెరువు కోసం గార్లకు వచ్చారు. వీరి కూతురు సౌమ్య డిగ్రీ, కుమారుడు రవి ఇంటర్ చదువుతున్నారు. కొన్ని నెలల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రవికి ఉద్యోగం ఇప్పిస్తానని సత్యనారాయణ నుంచి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు తెలిసింది.

అప్పు చేసి ఇచ్చిన ఈ డబ్బులను సమకూర్చే మార్గం లేక.. ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. భార్య రాణి కూడా కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. దీంతో శుక్రవారం రాణికి అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చిన సత్యనారాయణ బాధపడుతూ గుండెపోటుకు గురై మరణించాడు. తల్లిదండ్రులిద్దరూ వెనువెంటనే చనిపోవడంతో ఆ పిల్లలు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు